South Africa vs India : దెబ్బ అదుర్స్ కదూ.. రెండో టెస్టులో సఫారీలు చిత్తు..

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 05:13 PM IST

కొత్త ఏడాదిని భారత క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. గత ఏడాదిని ఇన్నింగ్స్ పరాజయంతో ముగించిన రోహిత్‌సేన న్యూఇయర్‌లో మాత్రం పుంజుకుంది. పేసర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై సఫారీలను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిపోయింది. తొలిరోజు తరహాలోనే రెండోరోజు కూడా కేప్‌టౌన్ పిచ్ బ్యాటర్లకు పరీక్ష పెట్టింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మక్ర్‌రమ్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ చెలరేగితే…రెండో ఇన్నింగ్స్‌లో బూమ్రా దెబ్బకు సౌతాఫ్రికా కుప్పకూలింది. మక్ర్‌రమ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. కనీసం స్కోరు 150 దాటగలిగింది. తొలి సెషన్ ఆరంభం నుంచే బూమ్రా దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మక్ర్‌రమ్ 106 పరుగులు చేసిన 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే సఫారీల ఇన్నింగ్స్‌కు తెరపడింది.

తర్వాత 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ జైశ్వాల్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని దూకుడుగా ఆడాడు. 23 బంతుల్లోనే 6 ఫోర్లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభమన్‌ గిల్,కోహ్లీ ఔటైనప్పటకీ.. రోహిత్ , శ్రేయాస్ అయ్యర్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు.దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ సమం చేసింది. అలాగే కేప్‌టౌన్‌లో తొలిసారి టెస్టుల్లో విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో పేసర్లదే హవా నడిచింది. రికార్డు స్థాయిలో తొలిరోజే 23 వికెట్లు పడగా… రెండు ఇన్నింగ్స్‌లు ముగిసాయి. సిరాజ్ దెబ్బకు సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలగా… భారత్ 153 పరుగులు చేసి కీలకమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఆరు సెషన్లలోనే మ్యాచ్‌ ముగిసిపోయింది.

Also Read:  Health Benefits: కాలి బొటనవేలుపై వెంట్రుకలు ఎక్కువగా వస్తున్నాయా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?