టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభానికి ఇంకా నెలరోజుల సమయమే ఉంది. ఇప్పటికే టోర్నీలో ఆడే దేశాలు తమ తమ జట్లను కూడా ప్రకటించాయి. బీసీసీఐ కూడా టీమిండియాను ఎంపిక చేసింది. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ లో భారత్ , చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతోంది.
అయితే పాక్ తో భారత తుది జట్టుపై మాజీ ఆటగాళ్ళు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్లేయింగ్ ఎలెవెన్ ను ప్రకటిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పాక్ తో ఆడే తుది జట్టును ఎంపిక చేశాడు. పఠాన్ తుది జట్టు ఎంపికలో చాలా వరకూ ఊహించిన ఆటగాళ్ళే ఉన్నప్పటకీ.. ఒకే ఒక మార్పు ఆశ్చర్యం కలిగించింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు పాక్ తో తుది జట్టులో అతను చోటివ్వలేదు.
పంత్ కంటే దినేశ్ కార్తీక్ బెటర్ అని అభిప్రాయపడుతూ డీకేకు చోటు కల్పించాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు టీమ్లో అనుభజ్ఞులైన బౌలర్లు ఉండాలని వ్యాఖ్యానించాడు.. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగానూ, మూడోస్థానంలో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్, ఐదో స్థానంలో దీపక్ హుడా, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఏడో స్థానంలో దినేష్ కార్తీక్, ఎనిమిదో స్థానంలో ఒక రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ చహల్, ఆ తర్వాత బుమ్రా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ ఉంటారన్నాడు. తన ఫైనల్ కాంబినేషన్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారనీ, వాళ్లలో ఇద్దరు క్వాలిటీ ఫాస్ట్ బౌలర్లన్నాడు. వీళ్లు డెత్ ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేయగలరన్నాడు. ఒక స్పిన్నర్ చాలని పఠాన్ అభిప్రాయపడ్డాడు. క్వాలిటీ ఫాస్ట్ బౌలర్లతో పాక్ పై విజయం సాధించే అవకాశముందని పఠాన్ అంచనా వేశాడు.