ఐపీఎల్ 2022 ప్లేఆఫ్ రేసులో నిలవాలవంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో బెంగుళూరు చేతులెత్తేసింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ.. ఆర్సీబీ జట్టు ఇంకా ఐపీఎల్ 15వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులోనే నిలిచింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన బెంగళూరు 7 మ్యాచుల్లో గెలిచి 6 మ్యాచుల్లో ఓటమిపాలైంది..
బెంగళూరు జట్టు ఇక లీగ్ దశలో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడనుండగా.. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మే 19న వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరగనున్న మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడితే మాత్రం పేలవ నెట్ రన్రేట్ కారణంగా లీగ్ దశలోనే ఆర్సీబీ నిష్క్రమించనుంది. ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ప్లేఆఫ్స్కి ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ చేరుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం 7 జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో లక్నో సూపర్ జెయింట్స్ 16 పాయింట్లతో ఉండగా.. ఆ జట్టు లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
అయితే.. మిగిలిన 6 జట్లు కూడా లక్నో సూపర్ జెయింట్స్ కు గట్టి పోటీ ఇస్తున్నాయి.. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు
ప్లేఆఫ్స్కి అర్హత సాధించాలంటే తన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ని తప్పకుండా ఓడించాలి. అలానే సన్రైజర్స్ హైదరాబాద్ తరువాత ఆడబోయే మూడు లీగ్ మ్యాచ్ల్లో కనీసం ఒక్క దాంట్లో అయినా ఓడిపోవాలి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తరువాత ఆడబోయే రెండు మ్యాచుల్లో కనీసం ఒక మ్యాచ్లో ఓటమి పాలైతేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికే ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి.