ఐపీఎల్ 2022 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది మార్చి 26న ప్రారంభమైన ఐపీఎల్ 2022వ ఎడిషన్కు సంబంధించి లీగ్ మ్యాచ్లను మహారాష్ట్రలోని ముంబై, పూణే నగరాల్లో నిర్వహిస్తున్న బీసీసీఐ.. ప్లే ఆఫ్స్ను ఎక్కడ నిర్వహిస్తారన్న విషయమై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 15వ సీజన్ క్వాలిఫయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్ వేదికలను బీసీసీఐ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా మే 22 వరకు లీగ్ దశ మ్యాచ్లు జరగనుండగా… ఆ తరువాత క్వాలిఫయర్, ఎలిమినేటర్, మే 29న ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి తగ్గినా నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు పలు దఫాలు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండో క్వాలిఫయర్ తో పాటుగా ఐపీఎల్ 2022 మెగా ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచులను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం… ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2022 సీజన్లో టైటిల్ రేసులో హాట్ ఫేవరెట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాల్లో నిలిచాయి.