టీ ట్వంటీ వరల్డ్ కప్ కు జట్టు కూర్పు ను సిద్ధం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ కు తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి ఊహించని షాక్ గానే చెప్పాలి. సొంత గడ్డపై తిరుగులేని గత రికార్డులు , ఐపీఎల్ ఫామ్ వంటి సానుకూల పరిణామాల మధ్య ఫేవరేట్ గా బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడింది. అయితే కీలకమయిన మూడో మ్యాచ్ లో అదరగొట్టి సఫారీల జోరుకు బ్రేక్ వేసింది. ఇప్పుడు అదే జోష్ లో మరో డూ ఆర్ డై పోరుకు సిద్ధమయింది. రాజ్ కోట్ వేదికగా జరగనున్న నాలుగో టీ ట్వంటీ లోనూ గెలుస్తెనే సీరీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు పలు రికార్డులు భారత క్రికెటర్లను ఊరిస్తున్నాయి.
ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ మరో సిక్సర్ బాదితే అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల క్లబ్లో చేరతాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ మరో 64 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ ట్వంటీల్లో 500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. భువనేశ్వర్ కుమార్ మరో 4 వికెట్లు తీస్తే బుమ్రా ను అధిగమించి అంతర్జాతీయ టీట్వంటీల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. అలాగే టీ ట్వంటీ సౌతాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా నిలవాలంటే అతడు మరో మూడు వికెట్లు తీసుకోవాలి. ఇక పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచేందుకూ భువి ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. మరోవైపు పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి అక్షర్ పటేల్ ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.