భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మహిళల టీ ట్వంటీ సిరీస్ (Women T20 Series) లో రెండో మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. చివరి బంతి వరకూ నరాలు తెగే టెన్షన్ తో సాగిన పోరులో భారత్ సూపర్ ఓవర్ (India Super Over) లో ఆసీస్ ను నిలువరించింది. ఆద్యంతం ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్, వికెట్ కీపర్ హీలీ 25 రన్స్ కు ఔటైనా మరో ఓపెనర్ హీలీ, మెక్ గ్రాత్ కలిసి భారీ పార్టనర్ షిప్ నమోదు చేసింది. భారత బౌలర్లు (Indian Bowlers) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో భారీ షాట్లతో విరుచుకుపడింది. హీలీ 54 బంతుల్లో 13 ఫోర్లతో 82, మెక్ గ్రాత్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 70 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఛేజింగ్ లో భారత మహిళల జట్టు (Indian Women Team) కూడా దూకుడుగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన ఎదురుదాడికి దిగారు. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకుంటూ బౌండరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 8.4 ఓవర్లలో 76 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. షెఫాలీ వర్మ 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులకు ఔటైనప్పటకీ మంధాన దూకుడు కొనసాగించింది. రోడ్రిక్స్ నిరాశపరిచినా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 21 పరుగులతో సపోర్ట్ చేసింది. చివర్లో మంధాన 79 పరుగులకు ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్లో విజయం కోసం 14 పరుగులు చేయాల్సి ఉండగా.. వికెట్ కీపర్ రిఛా ఘోష్ , మరో బ్యాటర్ దేవికతో కలిసి ధాటిగా ఆడడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ తప్పలేదు.
సూపర్ ఓవర్ లో భారత్ 20 పరుగులు చేసింది. రిఛా ఘోష్ మొదటి బంతినే సిక్సర్ కొట్టగా.. తర్వాత మంధాన వరుసగా ఫోర్ , సిక్సర్ కొట్టి చివరి బంతికి మూడు పరుగులు చేసింది. 21 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు 16 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. సిరీస్ లో తర్వాతి మ్యాచ్ బుధవారం బ్రౌబర్న్ స్టేడియంలో జరుగుతుంది.
Also Read: విడాకుల గురించి అడగొద్దు… షోయబ్ మాలిక్ రిక్వెస్ట్!