చాలా రోజుల తర్వాత స్వదేశంలో భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్ లను వీక్షిద్దామనుకున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ లో అభిమానులకు అనుమతి లేదు. కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్ లకు ఫ్యాన్స్ ను అనుమతించడం లేదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి జరగనున్న మూడు వన్డేలకూ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఖాళీ స్టేడియంలోనే ఈ మూడు వన్డే మ్యాచ్లూ జరగనున్నాయి. ఈ మేరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ట్విటర్లో వేదికగా పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 6 భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.. విండీస్ తో టీమిండియా తన 1000వ మ్యాచ్ను ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే 1000వ వన్డే ఆడుతున్న తొలి జట్టుగా భారత్ అరుదైన ఘనత సాదించనుంది. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ వన్డే మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు అంటూ ట్వీట్ చేసింది. లక్ష కెపాసిటీ కలిగిన ఈ భారీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు ఆడనుండడం అటు ఇరు జట్లకు కూడా నిరాశ కలిగించే వార్త. అయితే వైరస్ ఉధృతి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా టీ ట్వంటీ సిరీస్ కు మాత్రం ప్రేక్షకులను అనుమతించనున్నారు. బెంగాల్ లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో 75 శాతం సామర్థ్యంతో అభిమానులను అనుమతించేందుకు బెంగాల్ ప్రభుత్వం ఓకే చెప్పింది.
Considering the current situation, all the matches will be played behind the closed doors.
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) February 1, 2022