టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం ఇండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ రద్దు అయింది. బ్రిస్బేన్లో ఎడతెగని వర్షం కారణంగా బుధవారం జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో T20 ప్రపంచ కప్ లో టీమిండియా వార్మప్ మ్యాచ్ లు రెండు విజయాలు, ఒక ఓటమితో ముగిసింది. గబ్బా వేదికపై అంతకుముందు రోజు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య వార్మప్ గేమ్ కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం జరిగే టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడనుంది.
అయితే బుధవారం మ్యాచ్ జరగాల్సిన గబ్బా స్టేడియంలో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ మాత్రమే కాకుండా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కూడా రద్దు అయింది. ఈ నెల 23న పాక్ తో టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆడనుంది.