న్యూ ఇయర్లో మరో సిరీస్ విజయంపై కన్నేసింది టీమిండియా. హైదరాబాద్లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన భారత్ నేడు న్యూజిలాండ్తో (IND vs NZ ) రెండో వన్డేలో తలపడబోతోంది. బ్యాటర్లు, బౌలర్లు పూర్తి ఫామ్లో ఉన్న వేళ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అటు మొదటి వన్డేలో గెలుపుకు చేరువగా వచ్చిన కివీస్ సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా , న్యూజిలాండ్తో మరో సమరానికి సిద్ధమైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా రాయ్పూర్ వేదికగా రెండో వన్డేలో తలపడనుంది. హైదరాబాద్ మ్యాచ్లో శుభ్మన్గిల్ సూపర్ డబుల్ సెంచరీతో మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్కు సంబంధించిన విన్నింగ్ కాంబినేషన్ను మార్చే అవకాశాలు లేవనే చెప్పాలి.
ఓపెనర్లుగా రోహిత్ , గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. సూర్యకుమార్ , ఇషాన్ కిషన్ మిడిలార్డర్లోనే ఆడనున్నారు. కోహ్లీ కూడా తన జోరు కొనసాగిస్తే మరోసారి భారీస్కోరు ఖాయమని చెప్పొచ్చు. టాప్-5లో మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో రజత్ పటీదార్, శ్రీకర్ భరత్లు బెంచ్కే పరిమితం కానున్నారు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. అటు బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ అదరగొడుతున్నాడు. గత ఏడాది టెస్ట్ ఫార్మాట్లో రాణించిన సిరాజ్ ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. హోంగ్రౌండ్లో 4 వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్పై అంచనాలు మరింత పెరిగాయి. మిగిలిన వారిలో శార్థూల్ను తప్పించి ఉమ్రాన్ మాలిక్ను తీసుకునే అవకాశముంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ చోటుకు డోకా లేదు. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కుల్దీప్ అదరగొడుతున్నాడు. దాంతో చాహల్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు.
Also Read: Beijing: చైనా యుద్ధానికి సిద్ధమవుతోందా.. చైనా అధ్యక్షుడి మాటల్లో అర్థం ఏంటి?
మరోవైపు గత మ్యాచ్లో ఓడినప్పటకీ న్యూజిలాండ్ చివరి వరకూ పోరాడింది. ఆరంభంలోనే కీలక బ్యాటర్లు ఔటైనప్పటకీ… బ్రేస్వెల్ టీమిండియాను భయపెట్టాడు. మెరుపు సెంచరీతో కివీస్ను గెలిపించినంత పనిచేశాడు. దీంతో ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమనే చెప్పాలి. సిరీస్ చేజారిపోకుండా ఉండాలంటే రాయ్పూర్లో కివీస్ గెలిచి తీరాల్సిందే. వన్డేల్లోనూ నిలకడగా రాణిస్తున్న న్యూజిలాండ్ బ్యాటింగ్లో గాడిన పడాల్సి ఉంది. మ్యాచ్లో నిరాశపరిచిన కీలక బ్యాటర్లు పుంజుకుంటే సిరీస్ సమం చేయగలమని కివీస్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇదిలా ఉంటే రాయ్పూర్ పిచ్ కూడా బ్యాటింగ్కే అనుకూలంగా ఉంటుందని అంచనా. దీంతో మరోసారి హైస్కోరింగ్ గేమ్ ఖాయంగా కనిపిస్తోంది.