Site icon HashtagU Telugu

India Wins T20 Series: చివరి పంచ్ మనదే…ఆసీస్ పై సీరీస్ విజయం

India

Sky Kohli Imresizer (1)

ఆసియా కప్ వైఫల్యాన్ని అధిగమిస్తూ సొంత గడ్డపై టీమిండియా జూలు విదిల్చింది. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో సీరీస్ విజయాన్ని అందుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్ లో కంగారూలను చిత్తు చేసింది. బౌలింగ్ లో అక్షర్ పటేల్, బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాదవ్, కోహ్లీ అదరగొట్టారు

మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ గ్రీన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో బంతినే సిక్స్ బాదిన గ్రీన్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఫించ్ తో కలిసి తొలి వికెట్ కు 3.3 ఓవర్లలో 44 రన్స్ జోడించాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా గ్రీన్ దూకుడుగా ఆడాడు. కేవలం 21 బంతుల్లో 7 ఫోర్లు , 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. పవర్ ప్లే లో 66 రన్స్ చేసిన ఆసీస్ దూకుడు చూస్తే 200 పైన స్కోర్ ఖాయం అనిపించింది.అయితే గ్రీన్‌ను భువ‌నేశ్వ‌ర్ ఔట్ చేసి టీమ్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత స్మిత్‌, మ్యాక్స్‌వెల్ నిదానంగా ఆడ‌టంతో ఆసీస్ ర‌న్ రేట్ త‌గ్గుతూ వ‌చ్చింది. స్మిత్ 9, మ్యాక్స్‌వెల్ 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యారు.తర్వాత టిమ్ డేవిడ్‌, ఇంగ్లీస్ ఆసీస్ ఇన్నింగ్స్ నిలబెట్టారు.టీమ్ డేవిడ్ ధాటిగా ఆడ‌టంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. టిమ్ 27 బాల్స్ లో 4 సిక్స‌ర్లు, 2 ఫోర్ల‌తో 54 ర‌న్స్ చేయగా… డేనియ‌ల్ సామ్స్ 20 బాల్స్ లో 28 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆసీస్ 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు భువ‌నేశ్వ‌ర్‌, చాహ‌ల్, హర్షల్ పటేల్ త‌లో ఒక్క వికెట్ తీశారు.

187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కె ఎల్ రాహుల్ త్వరగానే ఔటవగా…రోహిత్ కూడా వెనుదిరిగడంతో భారత్ 30 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ఆసీస్ బౌలర్ల పై ఎదురు దాడికి దిగారు. ముఖ్యంగా సూర్య కుమార్ మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. అటు కోహ్లీ కూడా చెలరేగడంతో స్కోర్ బోర్డు ఫస్ట్ గేర్ లో పరిగెత్తింది. వీరిద్దరూ 104 పరుగులు జోడించారు.సూర్య కుమార్ యాదవ్ కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు , 5 సిక్సర్లతో 69 రన్స్ చేసి ఔటవగా …కోహ్లీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ , హర్థిక్ పాండ్య దూకుడు కొనసాగించారు. చివరి ఓవర్లో కోహ్లీ ఔటయినా , హార్థిక్ , దినేష్ కార్తిక్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. కోహ్లీ 48 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సీరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది.