Site icon HashtagU Telugu

IND vs SA: దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

IND vs SA

IND vs SA

IND vs SA: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న కీలకమైన వన్డే, టీ20 సిరీస్‌ల కోసం టీమ్ ఇండియాను (IND vs SA) ప్రకటించేందుకు కసరత్తు వేగవంతమైంది. అయితే కీలక ఆటగాళ్ల గాయాల కారణంగా జట్టు కూర్పు, ముఖ్యంగా నాయకత్వ బాధ్యతల విషయంలో సెలక్టర్లకు పెద్ద సవాలు ఎదురవుతోంది.

శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీ

భారత జట్టుకు అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కొత్తగా వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా టెస్ట్‌లో మెడ నొప్పి కారణంగా గాయపడిన గిల్.. వన్డే సిరీస్ నుంచి తప్పుకోగా, టీ20లలో కూడా అతని భాగస్వామ్యం అనుమానమే. అతని మెడ గాయం మరింత తీవ్రమైన ‘నరాల సమస్య’గా కనిపిస్తోందని, దీని కారణంగా గిల్ ఈ ఏడాది మిగిలిన క్రికెట్ ఆడటం కష్టమేనని సమాచారం.

Also Read: Accident : మరో ప్రవైట్ బస్సు ప్రమాదం..ఇద్దరు మృతి

దీనికి తోడు వన్డే వైస్-కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు అందుబాటులో ఉండకపోవడం సెలక్టర్లకు నాయకత్వ పరంగా పెద్ద చిక్కులు తెచ్చిపెట్టింది. అయ్యర్ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

కేఎల్ రాహుల్‌కే పగ్గాలు!

గిల్, అయ్యర్ ఇద్దరూ లేని నేపథ్యంలో వన్డే సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. భారత జట్టులో ఫస్ట్‌-ఛాయిస్ వన్డే వికెట్ కీపర్‌గా ఉన్న రాహుల్‌కు నాయకత్వ అనుభవం ఉండటం సానుకూలాంశం. గతంలో వన్డే కెప్టెన్‌గా పనిచేసిన రాహుల్‌.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా ఇటీవల జట్టును నడిపించిన రిషబ్ పంత్ పేరు పరిశీలనలోకి వచ్చినా, వన్డే ఫార్మాట్‌లో అతని అనుభవం తక్కువగా ఉండటంతో రాహుల్‌కే పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.

యువ ఆటగాళ్లకు అరుదైన అవకాశం

గిల్ స్థానంలో యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్య వరుసలో శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్ నాలుగో నంబర్ స్థానంలో ఆడేందుకు సిద్ధమవ్వవచ్చు. చాలా కాలంగా వన్డేలకు దూరంగా ఉన్న పంత్ మళ్లీ జట్టులోకి రావడానికి ఇది ఒక మంచి అవకాశం. వీరితో పాటు యువ ఆల్‌రౌండర్ తిలక్ వర్మను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే సిరీస్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు.

నవంబర్ 30న రాంచీలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ ఉంటుంది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో సెలక్టర్లు ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తారో? కొత్త ఆటగాళ్లకు ఏ మేరకు అవకాశాలు లభిస్తాయోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version