Mohsin Naqvi: టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించి సూపర్-8లోకి ప్రవేశించింది. అయితే ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్లో తీవ్ర దుమారం రేగుతోంది. దీనివల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ పదవి ప్రమాదంలో పడింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పుడు మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మొహ్సిన్ నఖ్వీపై మునీర్ ఎందుకు కోపంగా ఉన్నారు?
మీడియా నివేదికల ప్రకారం.. ఐసీసీ (ICC), పీసీబీ (PCB) మధ్య నడుస్తున్న వివాదంపై మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్ ప్రభుత్వానికి కానీ అసిమ్ మునీర్కు కానీ లేదా మరెవరికీ భయపడనని వ్యాఖ్యానించారు. తన పేరును ఈ వివాదంలోకి లాగడంపై అసిమ్ మునీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నఖ్వీ కేవలం క్రికెట్, అడ్మినిస్ట్రేటివ్ పరిధులకే పరిమితం చేయాల్సిందని మునీర్ అభిప్రాయపడ్డారు.
Also Read: స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్తో పోరు!!
భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా నఖ్వీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు ఏమీ తెలియని వ్యక్తి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడు అయ్యాడు. ఇక టీమ్ ఎలా నడుస్తుంది? మీరు అతన్ని సూపర్ స్టార్ను చేశారు. అతను ఒక్క మ్యాచ్ కూడా గెలవలేడు… అసమర్థుడైన, అజ్ఞాని అయిన వ్యక్తికి పెద్ద పదవి ఇవ్వడం ప్రపంచంలోనే అతిపెద్ద నేరం” అని మండిపడ్డారు.
భారత్తో మ్యాచ్పై పాకిస్థాన్ విముఖత
భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ మొదట నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఐసీసీ పీసీబీతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించిన తర్వాతే పాకిస్థాన్ ఆడేందుకు అంగీకరించింది. ఫిబ్రవరి 1న పాకిస్థాన్ ప్రభుత్వం తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా “మేము భారత్తో ఆడము కానీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొంటాము” అని పోస్ట్ చేసింది. కానీ ఆ తర్వాత తన మాట మార్చుకుంది. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు పాకిస్థాన్ను అంతర్జాతీయ స్థాయిలో నవ్వులపాలు చేస్తున్నాయి.
