Site icon HashtagU Telugu

Rishabh Pant: 93 సంవ‌త్స‌రాల‌ టెస్ట్ క్రికెట్ చరిత్రలో స‌రికొత్త రికార్డు సృష్టించిన పంత్‌!

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న‌ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ (Rishabh Pant) చరిత్ర సృష్టించాడు. రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. రెడ్-బాల్ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్‌గా ఇప్పటికే అతను రికార్డు సృష్టించాడు. పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134 రన్స్ చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 120 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు.

భారత జట్టు తమ మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్‌ను 1932లో ఆడింది. 93 సంవత్సరాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించలేదు. ఇప్పుడు రిషభ్ పంత్ ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, విదేశీ టూర్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన ప్రపంచంలోని తొలి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కూడా పంత్ రికార్డు సృష్టించాడు.

Also Read: KL Rahul: ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ సూప‌ర్ సెంచ‌రీ!

పంత్ ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్. కానీ ప్రపంచంలో ఈ రికార్డును మొదటగా సృష్టించినవాడు జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్. ఆండీ ఫ్లవర్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన తొలి వికెట్ కీపర్. రిషభ్ పంత్ ఇంగ్లాండ్‌లో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు.

పంత్ ఏడవ భారత బ్యాట్స్‌మన్

ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన మొత్తం ఏడవ భారత బ్యాట్స్‌మన్‌గా పంత్ నిలిచాడు. సునీల్ గవాస్కర్ మూడు సార్లు, రాహుల్ ద్రవిడ్ రెండు సార్లు, విజయ్ హజారే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఒక్కొక్కసారి ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ దిగ్గజ జాబితాలో రిషభ్ పంత్ పేరు కూడా చేరింది.