Site icon HashtagU Telugu

IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్‌ ఘోర పరాజయం.. కార‌ణాలివే?

India vs Australia

India vs Australia

IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత బ్యాట్స్‌మెన్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండటంతో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. సిరీస్‌లోని రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా (IND vs AUS) చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ పలకలేదు. అలాగే శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, తిలక్ వర్మ వంటి బ్యాట్స్‌మెన్ కూడా ఘోరంగా విఫలమయ్యారు.

టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎంతగా కుప్పకూలిందంటే జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. ఈ ఓటమికి కెప్టెన్ సూర్యకుమార్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన మూడు తప్పులే ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

సంజు శాంసన్‌ను ఎందుకు ప్రమోట్ చేశారు?

ఆసియా కప్‌లో ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన సంజు శాంసన్‌ను రెండో టీ20 మ్యాచ్‌లో అకస్మాత్తుగా మూడో నంబర్‌కు ప్రమోట్ చేశారు. సంజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. మూడో నంబర్‌లో ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తే అది తిలక్ వర్మకు ఇవ్వాల్సి ఉండేది. తిలక్ ఈ స్థానంలో అవకాశం దక్కినప్పుడల్లా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. స్వయంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గత మ్యాచ్‌లో ఇదే స్థానంలో అద్భుతంగా ఆడాడు. అనవసరంగా చేసిన ఈ ప్రయోగం మెల్‌బోర్న్‌లో భారత జట్టుకు చాలా భారంగా పరిణమించింది.

Also Read: KYV: కైవేవీ అంటే ఏమిటి? ఫాస్టాగ్‌ వినియోగదారులకు NHAI శుభవార్త!

శివమ్ దూబే కంటే హర్షిత్‌ను ఎందుకు ముందు పంపారు?

టీమ్ ఇండియా ఐదో వికెట్‌గా అక్షర్ పటేల్‌ను కోల్పోయినప్పుడు హర్షిత్ రాణా బ్యాటింగ్‌కు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హర్షిత్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో శివమ్ దూబే కంటే ముందు పంపాలనే నిర్ణయం ఎవరికీ అర్థం కాలేదు. హర్షిత్ 35 పరుగులు చేసినప్పటికీ అతను ఆ పరుగుల కోసం 33 బంతులు ఆడాడు. హర్షిత్ పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబేకు పెద్ద షాట్లు ఆడటం తప్ప మరో మార్గం లేకపోయింది. దీంతో అతను కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించకపోవడం

కాన్‌బెర్రా తర్వాత మెల్‌బోర్న్‌లోనూ టీమ్ మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11 నుండి తప్పించింది. ఈ నిర్ణయం కూడా భారత జట్టుకు చాలా నష్టం కలిగించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో లోతు కోసం హర్షిత్‌కు తుది జ‌ట్టులో చోటు కల్పించారు. కానీ బౌలింగ్‌లో హర్షిత్ తన 2 ఓవర్లలోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ ఉన్నప్పటికీ అతన్ని వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా ప్లేయింగ్ 11 నుండి తప్పించడం గమనార్హం.

Exit mobile version