ఇంగ్లాండ్ తో చివరి టెస్టులో అదరగొట్టిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపాడు.సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేసిన పంత్ టాప్ 5లోకి దూసుకొచ్చాడు. తాజా ప్రదర్శనతో పంత్ ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. బర్మింగ్ హామ్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో పంత్ 146 , రెండో ఇన్నింగ్స్లో 57 రన్స్ చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో నిలకడగా రాణించిన పంత్ 801 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు టాప్-10 జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడికే చోటు దక్కింది. భారత ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడికే స్థానం దక్కింది. కోవిడ్ బారిన పడి ఇంగ్లండ్తో టెస్టుకు దూరమైన రోహిత్ ఒక స్థానం కోల్పోయి తొమ్మిదో ర్యాంకులో నిలిచాడు. అటు గత కొంతకాలంగా వైఫల్యాల బాట వీడని విరాట్ కోహ్లీ ర్యాంకు రోజురోజుకూ దిగజారుతోంది. తాజా జాబితాలో కోహ్లీ నాలుగు స్థానాలు దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు. మరోవైపు ఎడ్జ్బాస్టన్లో అదరగొట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ తన టాప్ ప్లేస్ ను మరింత పటిష్టంగా చేసుకున్నాడు. ఇక వరుస సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్నఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఏకంగా 11 స్థానాలు మెరుగయ్యాడు. తాజా జాబితాలో బెయిర్ స్టో 10వ ర్యాంకులో నిలిచాడు.