భారత పర్యటనలో ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని ఆ దేశ మాజీ ఆటగాళ్ళతో పాటు ఆ దేశ మీడియా కూడా జీర్ణించుకోలేకపోతోంది. స్పిన్ పిచ్ లను అడ్డు పెట్టుకొని గెలిచారు. చెత్త పిచ్ లు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తొలి రెండు టెస్టుల పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ (ICC Announces Ratings) ఇచ్చిందనీ ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రచురించాయి. తొలి టెస్ట్ నాగ్పూర్ వేదికగా జరగ్గా రెండో టెస్ట్కు ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. ఈ దారుణ పరాభవాల నేపథ్యంలో స్పిన్ బౌలింగ్కు సహకరించేలా ఈ పిచ్లను భారత్ తయారు చేసుకుందని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయి.
తాజాగా ఐసీసీ కూడా నాగ్పూర్, ఢిల్లీ పిచ్లకు యావరేజ్ రేటింగ్ ఇచ్చినట్లు ఆస్ట్రేలియాకు చెందిన ది ఏజ్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికలు పేర్కొన్నాయి. మ్యాచ్ రిఫరీ కూడా ఐసీసీ రేటింగ్తో ఏకీభవించినట్లు ఈ కథనాల్లో వెల్లడించాయి. ఐసీసీ రేటింగ్ వార్తలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. ఐసీసీ నిజంగానే ఈ రేటింగ్ ఇచ్చిందా లేదా అన్నది అధికారికంగా మాత్రం వెల్లడికాలేదు.
Also Read: Steve Smith: మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం.. పాట్ కమిన్స్ దూరం
స్పిన్ పిచ్ లకు పూర్తిగా సిద్ధమయ్యే భారత్ కి వచ్చామని ఆస్ట్రేలియా కెప్టెన్ చెప్పినప్పటికీ గ్రౌండ్ లో మాత్రం ఆ జట్టు తేలిపోయింది. భారత టెయిలెండర్లు సైతం బ్యాట్ తో మెరుపులు మెరిపించిన పిచ్ పై ఆసీస్ ప్రధాన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.అయితే పిచ్ పై అక్కసు వెళ్లగక్కుతూ విమర్శలు చేస్తున్నారు. అటు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్స్, మీడియా సైతం భారత పిచ్ లు చెత్తగా ఉన్నాయని కామెంట్స్ చేయడం.. దానికి భారత క్రికెటర్లు కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఐసీసీ రేటింగ్ పేరుతో మరోసారి ఆసీస్ మీడియా కథనాలు ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది.