IPL Earnings: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ను గెలిచి పంజాబ్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్లో తమ ప్రయాణాన్ని ముగించింది. ఇప్పుడు జూన్ 3న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అయితే ఐపీఎల్లో ఈ జట్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీ యజమానులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ ఆ తర్వాత ఒక ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంటుంది? ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ నుండి నీతా అంబానీ, ప్రీతి జింటా (IPL Earnings) వంటి జట్టు యజమానులు ఎంత సంపాదిస్తారు? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ నుండి ఎంత సంపాదన?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు.. ఇది చాలా పెద్ద బిజినెస్ మోడల్ కూడా. ఈ టోర్నమెంట్లో కొత్త ఆటగాళ్లకు తమ ఆటను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో వేలంలో ఆటగాళ్లు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ యజమానులు కూడా గణనీయంగా సంపాదిస్తారు.
మీడియా నివేదికల ప్రకారం.. మ్యాచ్లో టికెట్ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో 80 శాతం భాగం జట్టు యజమానుల ఖాతాలోకి వెళ్తుంది. అలాగే అన్ని జట్ల జెర్సీలపై అనేక బ్రాండ్ల పేర్లు ముద్రించబడి ఉంటాయి. ఈ స్పాన్సర్షిప్ డబ్బు కూడా ఫ్రాంచైజీ యజమానులకు వస్తుంది. అంతేకాకుండా మీడియా రైట్స్లో ఒక పెద్ద వాటా కూడా జట్టు యజమానుల ఖాతాలోకి వెళ్తుంది.
ముంబై-పంజాబ్ మధ్య క్వాలిఫయర్-2 అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ను ఒకేసారి ఒక లక్షా ముప్పై ఐదు వేల మంది చూడవచ్చు. ఐపీఎల్లో ఒక మ్యాచ్ టికెట్ ధర స్టేడియం స్థానం ఆధారంగా 3,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు ఉంటుంది. ఒక టికెట్ ధర 3,000 రూపాయలుగా ఉన్నప్పటికీ.. ఒక లక్ష మంది వచ్చినా 30 కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడవుతాయి. అన్ని స్టేడియంలలో సీటింగ్ కెపాసిటీ, టికెట్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఇందువల్ల ఒక విషయం స్పష్టమవుతుంది. అది ఏమిటంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఫ్రాంచైజీలు కూడా భారీ లాభాలు ఆర్జిస్తాయి.