Gukesh : కెనడాలోని టొరంటో వేదికగా ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ హోరాహోరీగా జరిగింది. భారత్లోని తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గ్రాండ్మాస్టర్ గుకేష్ దొమ్మరాజు చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. టొరంటోలో జరిగిన 14 రౌండ్ల చెస్ టోర్నమెంట్లో గుకేష్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చాడు. ఈ ఏడాది చివర్లో జరిగే చెస్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్తో తలపడే అవకాశాన్ని గుకేశ్ దక్కించుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join
ఆదివారం రోజు అమెరికాకు చెందిన గ్రాండ్మాస్టర్ హికారు నకమురాతో జరిగిన తన ఆఖరి రౌండ్ మ్యాచ్ను బ్లాక్పీస్లో గుకేశ్(Gukesh) డ్రా చేసుకున్నాడు. గ్రాండ్మాస్టర్లు ఫాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచ్చి మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ను గుకేశ్ గెల్చుకున్నాడు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే టొరంటోలోని గ్రేట్ హాల్లో ప్రేక్షకులు పైకి లేచి, సరికొత్త ప్రపంచ టైటిల్ ఛాలెంజర్ అసాధారణ ఫీట్ను ప్రశంసిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్లో డింగ్ లిరెన్ను గుకేశ్ సవాలు చేయనున్నారు.
గతంలో మాగ్నస్ కార్ల్సెన్, గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ఛాంపియన్లుగా మారినప్పుడు వారి వయస్సు 22 ఏళ్లు. ఇక విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ చెస్ టోర్నీని కైవసం చేసుకున్న 2వ భారతీయుడిగా గుకేశ్ నిలిచారు. ఈ టోర్నీని భారత్ గెలుచుకోవడం దశాబ్దం తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఈ విజయం నేపథ్యంలో గుకేశ్కు అతడి చెస్ గురువు లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ‘‘టోర్నమెంట్లో ఎన్నో క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను గుకేశ్ సమర్ధంగా ఎదుర్కొన్నాడు. అనుభవజ్ఞుడైన నకమురాతో జరిగిన చివరి రౌండ్ మ్యాచ్ను కూడా డ్రా చేయగలిగాడు. దీన్నిబట్టి గుకేశ్ ట్యాలెంట్ ఏమిటో అందరికీ తెలిసొచ్చింది’’ అని విశ్వనాథన్ ఆనంద్ కితాబిచ్చారు.