ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్, భారత ఆటగాడు రోహిత్ శర్మతో దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఆయన ఫాలోవర్ల సంఖ్య 24 వేలు పెరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ గతంలో దక్కన్ ఛార్జర్స్ జట్టులో కలిసి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నారు. అడిలైడ్ మ్యాచ్కి ముందు వీరిద్దరూ కాసేపు ముచ్చటించి ఆ తర్వాత సెల్ఫీ తీసుకున్నారు. అడిలైడ్ వన్డేలో రోహిత్ శర్మ 73 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాళ్లలో ఆడమ్ గిల్క్రిస్ట్ ఒకడు. ఎంతటి అరివీర భయంకర బ్యాటరో 90వ దశకంలో క్రికెట్ చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాట్ పట్టాడంటే పరుగులు వాటంతట అవే వస్తాయి. గిల్క్రిస్ట్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువ. అలాంటి గిల్లీ రోహిత్ శర్మతో ఒక్క ఫొటో దిగి ఇన్స్టాలో పోస్ట్ చేశాడో లేదో.. తన ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరిగిందంటా!
అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23వ తేదీన భారత్ – ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆడమ్ గిల్క్రిస్ట్ రోహిత్ శర్మతో కలిసి కాసేపు ముచ్చటించాడు. ఆసీస్ – భారత్ సిరీస్కు కామెంటేటర్గా ఉన్న గిల్క్రిస్ట్.. పిచ్ రివ్యూ చెబుతూ హిట్మ్యాన్తో మాట్లాడాడు.
గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఐపీఎల్లో ఆడాడు. ఒకప్పటి దక్కన్ ఛార్జెస్ జట్టులో రోహిత్ శర్మ, గిల్క్రిస్ట్ కలిసి ఆడటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో దక్కన్ ఛార్జస్ ఐపీఎల్ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. దాంతో రోహిత్ను చూడగానే గిల్క్రిష్ట్ ఆప్యాయంగా పలకరించాడు. దక్కన్ బాయ్స్ అంటూ సెల్ఫీ వీడియో, ఫొటోలు కూడా తీసుకున్నారు.
రోహిత్ శర్మతో తీసుకున్న సెల్ఫీని గిల్క్రిస్ట్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అయితే గిల్క్రిస్ట్ ఫొటో పోస్ట్ చేయకముందు.. పోస్ట్ చేసిన తర్వాత ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో భారీగా ఛేంజ్ వచ్చిందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఏకంగా 24 వేల మంది ఫాలోవర్స్ పెరిగారంటూ ఎక్స్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గిల్లీ ఇన్స్టాగ్రామ్లో 83.3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
అడిలైడ్ వన్డేలో భారత్ ఓడిపోయినప్పటికీ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులే చేయగా.. అడిలైడ్ వన్డేలో చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో 73 పరుగులు చేశాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్గా మారడమే కాకుండా, తన ఆటను కూడా నిరూపించుకుని జట్టులో ప్లేస్ని ఫిక్స్ చేసుకున్నాడు.
