India vs Eng: బ్యాట్‌తో అదరగొట్టారు.. బంతితో బెదరగొట్టారు..

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 11:44 PM IST

బర్మింగ్‌హామ్ టెస్టులో భారత్ పట్టుబిగించింది. బ్యాటింగ్‌లో రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా సెంచరీలతో చెలరేగితే… బూమ్రా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో 29 పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన బూమ్రా తర్వాత బంతితోనూ ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తడబడుతోంది. రెండోరోజు ఆటలో పూర్తిగా టీమిండియానే ఆధిపత్యం కనబరిచింది. ఓవర్‌నైట్ స్కోర్‌ 338 రన్స్‌తో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌ దూకుడుగా ఆడింది. జడేజా శతకంతో చెలరేగడంతో స్కోర్ 400 దాటింది.

తొలిరోజు పంత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా రెండోరోజు శతకం పూర్తి చేసుకున్నాడు. జడ్డూ 13 ఫోర్లతో 103 పరుగులు చేసి 9వ వికెట్‌గా ఔటయ్యాడు. తర్వాత షమీ, శార్థూల్ ఠాకూర్ త్వరగానే ఔటైనా… బూమ్రా మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ భారీస్కోర్ చేసింది. బ్రాడ్ వేసిన ఓవర్లో రెచ్చిపోయిన బూమ్రా 35 పరుగులు రాబట్టాడు. బూమ్రా జోరుతో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. బూమ్రా 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్ 5 , పాట్స్ 2 వికెట్లు తీసుకున్నారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను బూమ్రా దెబ్బతీశాడు. మూడో ఓవర్ నుంచే ఆ జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. అలెక్స్ లీస్ 6, క్రాలే 9 పరుగులకు ఔటవగా… పోప్ 10 పరుగులకు వెనుదిరిగాడు. వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ పలుసార్లు నిలిచిపోయింది. రూట్ టీ బ్రేక్‌ తర్వాత కాసేపు నిలకడగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 31 పరుగులు చేసిన రూట్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత బెయిర్‌ స్టో, స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 332 పరుగులు వెనుకబడి ఉంది. బూమ్రా 3 వికెట్లు తీసుకోగా.. సిరాజ్, షమీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Photo Courtesy: BCCI/Twitter