Site icon HashtagU Telugu

Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెట‌ర్ యువరాజ్ సింగ్‌కు షాక్‌!

Yuvraj Singh

Yuvraj Singh

Yuvraj Singh: క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌ల తర్వాత ఇప్పుడు యువరాజ్ సింగ్‌ (Yuvraj Singh)పైనా ఈడీ దృష్టి పెట్టింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో విచారణ కోసం ఆయనకు సమన్లు పంపింది. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ఒకరు. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసుల్లో ఈడీ సెలబ్రిటీలను వరుసగా విచారణకు పిలుస్తోంది. ఇప్పుడు ఈ చిక్కుల్లో యువరాజ్ సింగ్ పడ్డారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) యువరాజ్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 23, 2025న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించింది. ఇది ప్రధానంగా వన్‌ఎక్స్ బెట్ అనే బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన కేసు. ఈ కేసులో ఇప్పటికే శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను ఈడీ విచారించింది. అంతేకాకుండా ప్రముఖ నటుడు సోనూ సూద్‌ను కూడా సెప్టెంబర్ 24న విచారణకు పిలిచింది.

Also Read: Illegal Relationship : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త చెవులు కోసేసిన భార్య

రాబిన్ ఉతప్పకూ కష్టాలు

యువరాజ్ సింగ్‌తో పాటు మరో క్రికెటర్ రాబిన్ ఉతప్పను కూడా ఈడీ విచారణకు పిలుస్తోంది. ఇదే బెట్టింగ్ యాప్ కేసులో ఆయనకు సమన్లు అందాయి. సెప్టెంబర్ 22న ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు. రాబిన్ ఉతప్ప క్రికెట్‌కు వీడ్కోలు పలికి కామెంట్రీతో పాటు యాప్‌ల ప్రమోషన్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని సమాచారం. ఈ ఈడీ కేసు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించినదే కావడం గమనార్హం. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

అసలు ఏమిటీ కేసు?

వన్‌ఎక్స్ బెట్ అనే బెట్టింగ్ యాప్ చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. 2023లో ఈ యాప్‌ను భారత్‌లో నిషేధించారు. అయినప్పటికీ వేర్వేరు డొమైన్‌ల ద్వారా భారత్‌లో ఇది ఇంకా పనిచేస్తోంది. అంతేకాకుండా సెలబ్రిటీలు దీనికి ప్రచారం కల్పిస్తున్నారు. మనీ లాండరింగ్‌ను అరికట్టేందుకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా యాప్‌ను ప్రచారం చేసిన సెలబ్రిటీలను విచారణకు పిలుస్తోంది. సురేశ్ రైనా, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్‌లను ఇప్పటికే విచారించారు. ఇప్పుడు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పల వంతు వచ్చింది.