Raina- Dhawan: భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ (Raina- Dhawan) ఇద్దరికీ చిక్కులు పెరిగాయి. అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో వారిపై చర్యలు తీసుకుంటూ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వారి రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. విదేశీ సంస్థలతో కలిసి అక్రమ బెట్టింగ్ కంపెనీ 1xBetను రైనా, ధావన్ ప్రచారం చేశారని ఈడీ తన విచారణలో గుర్తించింది.
Also Read: Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వశ్చన్ ఏంటంటే?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సురేష్ రైనాకు సంబంధించిన రూ. 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడిని, శిఖర్ ధావన్కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తిని ఈడీ జప్తు చేసింది. ఈ విచారణలో ఈడీ మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పను కూడా ప్రశ్నించింది. నటులు సోనూ సూద్, ఊర్వశి రౌతేలాను కూడా విచారణకు పిలిపించారు. 1xBet, దాని అనుబంధ బ్రాండ్లపై అక్రమ లావాదేవీలు, ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించడంతో పాటు మోసం ఆరోపణలు కూడా ఉన్నాయని అనేక రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది.
ఈ ఎఫ్ఐఆర్ల (FIRs) కారణంగానే పోలీసులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రారంభ దర్యాప్తులో ఈడీకి అనుమానాస్పద డబ్బు లావాదేవీలు, విదేశీ ఖాతాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. 1xBet యాప్ భారతదేశంలో చట్టబద్ధం కాదని (లీగల్ కాదని) తెలిసినప్పటికీ, క్రికెటర్లు దానిని ప్రచారం చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. 1xBet అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్ అని, ఇందులో 18 సంవత్సరాలు పైబడిన వారు బెట్టింగ్ ఆడవచ్చని అది (1xBet) పేర్కొంది. ఈ కేసులో ఇద్దరు క్రికెటర్లపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటి పెద్ద చర్య. ఏజెన్సీ తరఫున ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్తులో మరికొన్ని పేర్లు కూడా ఈ చర్యల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
