Site icon HashtagU Telugu

DC vs RCB: ప్ర‌తీకారం తీర్చుకున్న బెంగ‌ళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘ‌న‌విజ‌యం!

IPL Tickets

IPL Tickets

DC vs RCB: ఐపీఎల్ 2025 46వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ).. ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC vs RCB) 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంలో ఆర్‌సీబీ హీరోలుగా విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా నిలిచారు. వీరిద్దరూ నాల్గవ వికెట్ కోసం శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ 51 పరుగులు, కృనాల్ 73 పరుగులతో ఆకట్టుకున్నారు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల టేబుల్‌లో మొదటి స్థానానికి చేరుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. దీనికి బ‌దులుగా ఆర్‌సీబీ ఒక దశలో కేవలం 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే విరాట్- కృనాల్ దమ్మున్న బ్యాటింగ్‌తో తమ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. ఈ విధంగా ఆర్‌సీబీ ఢిల్లీ చేతిలో బెంగళూరు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కృనాల్ పాండ్యా 47 బంతుల్లో నాటౌట్‌గా 73 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 5 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో 9 సంవత్సరాల తర్వాత కృనాల్ అర్ధసెంచరీ సాధించాడు. ఇంతకు ముందు అతని బ్యాట్ నుండి ఫిఫ్టీ 2016లో వచ్చింది.

Also Read: Rajamouli: నేను తీయ‌బోయే మ‌హాభార‌తంలో నాని ఫిక్స్‌: రాజ‌మౌళి

163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఆరంభం చాలా దారుణంగా ఉంది. డెబ్యూ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన జాకబ్ బెథల్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవలేకపోయాడు. అనంతరం రజత్ పాటిదార్ రనౌట్ అయ్యాడు. అతను 6 పరుగులు చేశాడు. ఈ విధంగా ఆర్‌సీబీ కేవలం 26 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ 47 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. దీంతో విరాట్ ఆరెంజ్ క్యాప్‌ను కూడా తన పేరిట చేసుకున్నాడు. చివరగా టిమ్ డేవిడ్ కేవలం ఐదు బంతుల్లో 19 పరుగులు చేశాడు. అతను మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఢిల్లీ తరఫున కెప్టెన్ అక్షర్ పటేల్ అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. అతను తన నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే దుష్మంత చమీరా 3 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.