భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎప్పుడు టెస్టు సిరీస్ వచ్చినా ఇరు దేశాల అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగనుంది. గత 18 ఏళ్లుగా ఆస్ట్రేలియా జట్టు భారత్లో టెస్టు సిరీస్ను గెలవలేకపోయింది. ఇప్పుడు టెస్టు సిరీస్కు ముందు కూడా ఆస్ట్రేలియా జట్టు కష్టాలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టు స్టార్ ప్లేయర్లలో ఒకరు భారత పర్యటన కోసం వీసా పొందలేకపోయాడు.
ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ కి బయలుదేరింది. అయితే టెస్టు సిరీస్కి ఎంపికైన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Khawaja) మాత్రం ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. ఉస్మాన్ ఖవాజాకి ఇండియన్ వీసా రావడం ఆలస్యం కావడంతో అతను ఆస్ట్రేలియా టీమ్తో కలిసి ఇండియాకి రాలేకపోయాడు. ఉస్మాన్ ఖవాజా గురవారం లేదా శుక్రవారంలోగా ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: IND Vs NZ T20 Match: నేడే ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజా బుధవారం ఇన్స్టాగ్రామ్లో ఓ మీమ్ పోస్ట్ చేసి నేను నా భారతీయ వీసా కోసం ఎదురు చూస్తున్నాను.. నన్ను వదిలేయకండి అంటూ క్యాప్షన్ రాశాడు. 36 ఏళ్ల ఖవాజా 12 నెలల పాటు 78.46 సగటుతో 1,020 పరుగులు చేసిన తర్వాత సోమవారం నాడు ఆస్ట్రేలియా పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా షేన్ వార్న్ అవార్డును పొందాడు. ఉస్మాన్ ఖవాజా గత కొంత కాలంగా ఆస్ట్రేలియా తరఫున రాణిస్తున్నాడు. తన ఆటతో అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున 56 టెస్టుల్లో 13 సెంచరీలతో సహా 4162 పరుగులు చేశాడు. 40 వన్డేల్లో 1554 పరుగులు, 9 టీ20ల్లో 241 పరుగులు చేశాడు.