India vs New Zealand : వన్డే ప్రపంచకప్ లీగ్ స్టేజ్ ముగిసింది. 45 మ్యాచ్లలో కొన్ని రసవత్తరంగా జరిగితే.. మరికొన్ని సంచలనాలు కూడా నమోదయ్యాయి. అంచనాలు పెట్టుకున్న జట్లలో ఇంగ్లాండ్ ఘోరంగా నిరాశపరిస్తే, టైటిల్ ఫేవరెట్స్ భారత్, ఆసీస్, సౌతాఫ్రికాతో పాటు గత ఎడిషన్ రన్నరప్ కివీస్ సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. బుధవారం జరగనున్న తొలి సెమీస్లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా.. గురువారం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఢీకొంటాయి. ఇప్పటికే ముంబై చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్లో బిజీగా ఉన్నాయి. సెమీస్కు కౌంట్డౌన్ మొదలవడంతో ఇరు జట్ల మధ్య గత రికార్డులపై అందరి దృష్టి పడింది. గత రికార్డులను చూస్తే ఓవరాల్గానూ, ఇండియాలోనూ టీమిండియాది పై చేయిగా ఉంటే, ప్రపంచకప్లో మాత్రం కివీస్దే ఆధిపత్యంగా నిలిచింది.
We’re now on WhatsApp. Click to Join.
ముందు ఓవరాల్ వన్డే రికార్డులను చూస్తే ఇప్పటి వరకూ ఇరు జట్లూ 117 మ్యాచ్లలో తలపడితే భారత్ 59 మ్యాచ్లలో గెలిచింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్లలో విజయం సాధించగా.. ఒకటి టైగా ముగిసింది. 7 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. కాగా భారత్ విజయాల శాతం 50.42గా ఉంటే.. కివీస్ది 42.73 శాతంగా ఉంది. ఇక భారత గడ్డపైనా మనదే పై చేయిగా ఉంది. స్వదేశంలో భారత్, కివీస్తో 39 మ్యాచ్లు ఆడి 30 విజయాలు అందుకుంది. 8 మ్యాచ్లలో న్యూజిలాండ్ గెలిస్తే ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. దీంతో సొంతగడ్డపై కివీస్ ప్రత్యర్థిగా భారత్ గెలుపు శాతం 76.92గా ఉంటే.. న్యూజిలాండ్ది 20.51 శాతంగా ఉంది.
అయితే ఐసీసీ మెగా టోర్నీలో మాత్రం భారత్పై న్యూజిలాండ్దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ వరల్డ్కప్ రికార్డును చూస్తే ఇరు జట్లూ 10 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 4 సార్లు గెలిస్తే.. న్యూజిలాండ్ ఐదింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. వరల్డ్కప్లో భారత్పై కివీస్ గెలుపు శాతం 50గా ఉంటే.. టీమిండియా విజయాల శాతం 40గా ఉంది. అయితే ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో రోహిత్సేననే ఫేవరెట్గా భావిస్తున్నారు. లీగ్ స్టేజ్లో ఇప్పటికే కివీస్పై భారత్ గెలిచింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. డారెల్ మిఛెల్ సెంచరీతో న్యూజిలాండ్ 273 పరుగులు చేయగా.. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే ఛేజింగ్లో రోహిత్శర్మ, గిల్ , శ్రేయాస్ అయ్యర్ త్వరగానే ఔటవడం కాస్త టెన్షన్ పెట్టినా.. కోహ్లీ 95 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా రాణించడంతో భారత్ 2 ఓవర్లుండగా గెలిచింది. కాగా సెమీస్లో కివీస్ను తేలిగ్గా తీసుకోవద్దని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద వరల్డ్కప్ వరకూ గత రికార్డుల్లో కివీస్ పైచేయిగా ఉన్నప్పటకీ ఈ సారి దానిని రోహిత్ సేన సమం చేస్తుందని(India vs New Zealand) అంచనా వేస్తున్నారు.