Mitchell Marsh: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పై (Mitchell Marsh) కేసు నమోదైంది. వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంతో భారత్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ యూపీలోని అలీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మార్ష్ పై FIR నమోదు చేశారు. ట్రోఫీపై కాళ్లు పెట్టి భారత క్రికెట్ అభిమానుల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడు భారత్ లో ఆడకుండా నిషేధించాలని కంప్లైంట్ కాపీని ప్రధాని మోదీకి పంపారు. అసలు విషయం ఏంటంటే.. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్పై గెలిచిన ఆస్ట్రేలియా ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఆరోసారి ప్రపంచకప్ గెలిచిన కంగారూలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు.
అయితే ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీపై తన పాదాలను ఉంచిన ఫోటో వైరల్గా మారింది. ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని రెండు పాదాలను ప్రపంచకప్ ట్రోఫీపై ఉంచుతూ మార్ష్ ఇచ్చిన స్టిల్ తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా భారత అభిమానులు మార్ష్ ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలోనే అలీగఢ్కు చెందిన పండిట్ కేశవ్ ఆర్టీఐ కార్యకర్త మిచెల్ మార్ష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో మిచెల్ మార్ష్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ వైరల్ ఫోటోతో క్రికెటర్ భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని పేర్కొంది. ప్రపంచకప్పై పాదాలు వేసి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అవమానించడమే కాకుండా 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని కూడా కించపరిచారని కేశవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ను భారత్లో ఆడకుండా.. భారత్తో ఎక్కడా ఆడకుండా జీవితకాలం నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు కాపీని ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కార్యాలయాలకు కూడా పంపారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రపంచకప్లో ఆడిన మిచెల్ మార్ష్ భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరమయ్యాడు. కెప్టెన్ పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మరికొందరు క్రికెటర్లు ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్నారు. స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్, స్టినిస్, మ్యాక్స్ వెల్ వంటి ఆటగాళ్లు టీమ్ ఇండియాతో టీ20 సిరీస్ ఆడుతున్నారు.