ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్- 2022 ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ గ్రూప్ స్టేజ్, నాకౌట్ ఫార్మాట్లో జరగనుంది. ప్రస్తుతం ఈ టోర్నీ 8వ ఎడిషన్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 23వ తేదీన పాకిస్థాన్తో తలపడనుంది.
ఇప్పటివరకు జరిగిన ఏడు టీ20 వరల్డ్కప్ టోర్నీలలో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల బాదిన ప్లేయర్స్ లిస్ట్లో అగ్రస్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 31 ఇన్నింగ్స్లలో 63 సిక్స్లు బాదాడు. అయితే.. యువరాజ్ సింగ్ 33 సిక్స్లు బాది ఈ టోర్నీలో రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున ఈ టోర్నీలో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా యువీ తొలి స్థానంలో ఉన్నాడు. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 28 ఇన్నింగ్స్లు ఆడిన యువీ.. 33 సిక్స్లు బాదాడు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీలో ఇప్పటివరకు 30 ఇన్నింగ్స్ల్లో 31 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున రెండో స్థానంలో ఉన్నాడు.
అయితే.. మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువులో ఉన్నాడు. ఇప్పటివరకు ఈ ఐసీసీ టోర్నీలో 31సిక్సర్లు రోహిత్ శర్మ కొట్టాడు. అయితే మరో మూడు సిక్స్లు బాదితే ఈ మేజర్ ఈవెంట్లో టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ టోర్నీలో ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, షేన్ వాట్సాన్ 31 సిక్సర్లు బాది 4, 5 స్థానాల్లో ఉన్నారు.