T20 World Cup: టీ ట్వంటీ ప్రపంచకప్ లో మరోసారి లో స్కోరింగ్ మ్యాచ్ అభిమానులకు మజానిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ 106 పరుగుల స్కోరును కాపాడుకుంది. ఒకదశలో గెలిచేలా కనిపించినప్పటకీ నేపాల్ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అమెరికా పిచ్ లే అనుకుంటే విండీస్ పిచ్ లపైనా తక్కువ స్కోర్లు నమోదవుతుండడం ఆశ్చర్యపరిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ బౌలర్లు తమ బౌలింగ్ తో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. సమిష్టిగా రాణించి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. బంగ్లా ఇన్నింగ్స్ లో ఐదుగురు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. బంగ్లా బ్యాటింగ్ లో షకీబుల్ 17 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
107 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నేపాల్ 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. బంగ్లా పేసర్లు తంజిమ్ హసన్, ముస్తఫిజర్ తమ బౌలింగ్ తో నేపాల్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అయితే కుషాల్, దీపేంద్రసింగ్ కీలక పార్టనర్ షిప్ నెలకొల్పడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ ఆరో వికెట్ కు 52 పరుగులు జోడించారు. చివరి 4 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా బంగ్లా ఓటమి ఖాయమనిపించింది. ఈ దశలో బంగ్లా బౌలర్లు మరోసారి విజృంభించి నేపాల్ ను కట్టడి చేశారు. వరుస వికెట్లు పడగొట్టి బంగ్లాను గెలిపించారు. నేపాల్ చివరి ఐదు వికెట్లను 7 పరుగుల తేడాలో కోల్పోయింది. ఫలితంగా నేపాల్ ఇన్నింగ్స్ ను 85 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ 4 , ముస్తఫిజర్ 3 వికెట్లు తీశారు. టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో 106 పరుగులను కాపాడుకోవడం ఇదే తొలిసారి. కాగా ఈ విజయంతో బంగ్లాదేశ్ సూపర్ 8కు చేరింది.
Also Read: konidela Susmitha : బాబాయ్ వల్లే మాకు గొడవలు వచ్చేవి – సుష్మిత