కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.

Published By: HashtagU Telugu Desk
Mustafizur Rahman

Mustafizur Rahman

T20 World Cup Controversy: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ యాజమాన్యం అతడిని జట్టు నుండి బయటకు పంపింది. అయితే ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఇది కేవలం ఒక ఆటగాడికి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య దౌత్యపరమైన వివాదంగా మారింది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంచలన నిర్ణయం

ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రతా పరమైన ముప్పు ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ మ్యాచులను భారత్ నుండి తరలించి పూర్తిగా శ్రీలంకలోనే నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: జన నాయగన్ Vs పరాశక్తి.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు

వివాదంపై BCB చైర్మన్ ఏమన్నారంటే?

టీ20 వరల్డ్ కప్ వేదికను మార్చాలనే డిమాండ్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అమీనుల్ ఇస్లాం ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తమ జట్టు పర్యటించడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని, అందుకే ఈ వేదిక మార్పును కోరుతున్నామని ఆయన తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో అత్యవసర సమావేశాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. మేము ఈ విషయంలో బీసీసీఐతో ఎలాంటి చర్చలు జరపము. నేరుగా ఐసీసీతోనే మాట్లాడతాము. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ అనేది ఐసీసీ టోర్నమెంట్, దాని నిర్వహణ బాధ్యత వారిదే అని అమీనుల్ ఇస్లాం స్పష్టం చేశారు.

ఈ వివాదం కారణంగా ఐసీసీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకపోతే, టోర్నమెంట్ షెడ్యూల్, వేదికల కేటాయింపులో మార్పులు చేయాల్సి రావచ్చు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి సీనియర్ ఆటగాడిని ఐపీఎల్ జట్టు నుండి తొలగించడం వెనుక ఉన్న కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ఈ ఒక్క ఘటన ప్రపంచ క్రికెట్ రాజకీయాలను వేడెక్కించింది.

  Last Updated: 06 Jan 2026, 06:46 PM IST