ఐపీఎల్ 2022లో ముంబై జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది.కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో ముంబై పరాజయం పాలయ్యింది. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఇది హ్యాట్రిక్ ఓటమి. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైనప్పటికీ ఆ జట్టు తరపున అరంగేట్రం చేసిన జూనియర్ ఎబిడి డెవాల్డ్ బ్రెవిస్ తొలి మ్యాచ్లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అండర్-19 వరల్డ్కప్లో దుమ్మురేపిన బ్రెవిస్కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ అయినా కూడా చూడముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్నాడు.. తీవ్ర ఒత్తిడిలో క్రీజులోకి వచ్చిన బ్రెవిస్కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. అయినా చక్కటి షాట్లతో అలరించాడు. కమిన్స్, ఉమేశ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ను ఎదుర్కొని నిలిచాడు. 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి స్టంపౌట్గా వెనుదిరిగాడు. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతికి డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన నో లుక్ సిక్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు. వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన డెవాల్డ్ బ్రెవిస్ కనీసం బంతిని కూడా చూడకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇదిలాఉంటే.. డెవాల్డ్ బ్రెవిస్ అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐసీసీ మెగా ఈవెంట్లో మొత్తంగా 58.88 సగటుతో 530 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలోనే మెగా వేలంలో బ్రెవిస్ రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే కోల్ కత్తాపై మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ జట్టులో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 50 పరుగులు, ప్యాట్ కమిన్స్ 56 పరుగులతో చెలరేగడంతో కేకేఆర్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.