IND vs SA 2nd Test: భారత్ సౌతాఫ్రికా జట్ల మధ్య చివరి టెస్టు జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదకిగా జరగనుంది. తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైన ఇండియన్ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే చాప చుట్టేసింది.. అయిదు రోజుల పాటు జరగాల్సిన టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. దీంతో 2 టెస్టుల సిరీస్లో టీమిండియా 0-1తో వెనుకబడింది.
సిరీస్ నిలుపుకోవాలంటే జనవరి 3వ తేదీ నుంచి జరిగే రెండో టెస్టులో గెలవాల్సి ఉంది. గెలిచినా సిరీస్ సమం అవుతుంది. దీంతో రెండో టెస్టుపై ఇరు జట్లూ కన్నేశాయి. ఇదిలా ఉండగా తోలి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా జట్టును వీడాడు. అతని స్థానంలో డీన్ ఎల్గర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కాగా జనవరి 3 నుంచి 7 వరకు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. కేప్టౌన్లోని న్యూలాండ్స్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడతాయి. తొలుత ఈ టెస్ట్ సిరీస్ కు ప్రకటించిన జట్టులో మహ్మద్ షమీకి స్థానం దక్కింది. అయితే.. గాయంతో బాధపడుతున్న షమీ పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు.
రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 27 ఏళ్ల అవేశ్ ఖాన్ను రెండో టెస్టు కు ఎంపిక చేసింది. ఈ టెస్టుకు ముందు సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్లో అవేశ్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో టీమిండియా సెలెక్టర్లు అవేశ్ ఖాన్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించారు. ఇక రెండో టెస్టుకు ముందు భారత మాజీ ప్లేయర్, దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా భారత జట్టుకు కీలక సూచనలు చేశాడు. రెండో టెస్టు తుది జట్టులో అశ్విన్ స్థానంలో జడేజాను తీసుకోవాలని సూచించాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్ను టీమ్లోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు గవాస్కర్.