మిషన్ వరల్డ్ కప్ జర్నీని సక్సెస్ ఫుల్ గా మొదలు పెట్టిన టీమిండియా శ్రీలంకను చిత్తు చేసి.. తాజాగా న్యూజిలాండ్ పైనా వన్డే సిరీస్ ను క్లీన్స్వీప్ చేసింది. అన్ని విభాగాల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ టాప్ టీమ్ గా ఉన్న కివీస్ ను ఓడించి ఆ జట్టు అగ్రస్థానం కైవసం చేసుకుంది. అయితే తమకు ర్యాంకులు ముఖ్యం కాదని.. ప్రణాళికలకు తగినట్లుగా ఆడడం వన్డే క్రికెట్లో చాలా ముఖ్యమని రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పాడు. వరుస సెంచరీలతో అదరగొడుతున్న గిల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. అలాంటి యువ బ్యాటర్ ప్రస్తుతం జట్టుకు చాలా అవసరమన్నాడు. ఇదిలా ఉంటే రాబోయే ఆసీస్ సిరీస్ తమకు సవాల్ అన్నాడు. కంగారు జట్టుపై గెలవడం అంత ఈజీ కాదన్నాడు. గత రెండేళ్లుగా ఆ జట్టు పై ఇంటా బయటా ఆధిపత్యం కనబరిచామనీ గుర్తు చేశాడు.
Also Read: ICC Test Team of the Year 2022: ఐసీసీ టెస్టు జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్కడు
అయినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే చాలా ప్రమాదమని చెప్పాడు. కంగారూలు కూడా నిలకడగా రాణిస్తున్నారని హిట్ మ్యాన్ వ్యాఖ్యానించాడు. కాగా న్యూజిలాండ్ పై సీరీస్ విజయం ఉత్సాహాన్ని ఇచ్చిందన్నాడు రోహిత్. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. మూడో వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన శార్దూల్ చాలా రోజులుగా సత్తా చాటుతున్నాడనీ గుర్తు చేశాడు. జట్టులో అతన్ని అందరూ మెజిషియన్ అంటారన్నాడు. అవసరమైనప్పుడల్లా బ్యాట్, బంతితో మెరుస్తాడనీ, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక కుల్దీప్ యాదవ్కు బంతిని అందించినప్పుడల్లా రాణిస్తున్నాడనీ ప్రశంసించాడు. తాను సెంచరీ సాధించడంపైనా రోహిత్ స్పందించాడు. ఈ సెంచరీ తనకు అదనపు మైలురాయి లాంటిదన్నాడు.