ఐపీఎల్ 2021 సీజన్ రన్నరప్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఏడాది ఆశించినస్థాయిలో రాణించడం లేదు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 4 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ లో ఐదు వరుస పరాజయాల పరంపరకు చెక్ పెడుతూ సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఐపీఎల్ 15వ సీజన్లో కేకేఆర్ జట్టు లీగ్ దశలో ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. ఈ నాలుగింటిలోనూ ఆ జట్టు గెలిస్తే అప్పుడు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉండనుంది.
ఒకవేళ అన్ని మ్యాచుల్లో గెలిచినా కూడా.. మిగిలిన జట్ల గెలుపోటములుపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే? ఒక్క ముంబై ఇండియన్స్, మినహా అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి… ఈ క్రమంలో కేకేఆర్ తానూ ఆడబోయే తర్వాతి మ్యాచుల్లో మెరుగైన రన్ రేట్ తో విజయం సాధించాల్సి ఉంటుంది… ఇదిలాఉంటే.. మే7న కేకేఆర్ తన తరువాతి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుండగా ఈ మ్యాచ్కు ముందు కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో తాము ఆడాల్సిన ఆఖరి 4 మ్యాచ్లను ఫైనల్స్గా భావించి ఆడుతామని, ఈ మ్యాచ్ల్లో తమ అసలు సత్తా ఏంటో బయటపెడతామని పేర్కొన్నాడు. అలాగే ఈ సీజన్ లో తాము ప్లే ఆఫ్స్ చేరేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పాడు. గెలుపోటముల్లో తమకు అండగా నిలుస్తున్న కోల్ కత్తా అభిమానులకు ఈ సందర్భంగా రస్సెల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.