Site icon HashtagU Telugu

Ajinkya Rahane: అజింక్య రహానే సంచ‌ల‌న నిర్ణ‌యం!

Ajinkya Rahane

Ajinkya Rahane

Ajinkya Rahane: రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు ముందు ముంబై కెప్టెన్సీని అజింక్య రహానే (Ajinkya Rahane) వ‌దిలేశాడు. ఈ విషయాన్ని రహానే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. అజింక్య రహానే తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. అందులో “ముంబై జట్టుకు నాయకత్వం వహించడం, ఛాంపియన్‌షిప్ గెలవడం నాకు చాలా గర్వకారణం. కొత్త దేశవాళీ సీజన్ రాబోతోంది. కొత్త కెప్టెన్‌కు అవకాశం ఇవ్వడానికి ఇది సరైన సమయం అని నేను నమ్ముతున్నాను. అందుకే కెప్టెన్‌గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నాను” అని రహానే రాశాడు.

అంతేకాకుండా “ఒక ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. తద్వారా మరిన్ని ట్రోఫీలు గెలుచుకోవచ్చు. ఈ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నాడు.

Also Read: IND vs PAK: ఆసియా క‌ప్ 2025.. భార‌త్‌- పాక్ మ్యాచ్‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌!

రహానే కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన ముంబై

అజింక్య రహానే కొంతకాలంగా రంజీ ట్రోఫీలో ముంబైకి నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వంలోనే ముంబై 2023-24 సీజన్‌లో రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుని 7 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. దీనితో పాటు రహానే కెప్టెన్సీలో ముంబై ఇరానీ ట్రోఫీని కూడా గెలుచుకుంది.

ముంబై తరఫున రహానే అద్భుత ప్రదర్శన

అజింక్య రహానే ఇప్పటివరకు ముంబై తరఫున 76 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 52 సగటుతో 5,932 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 19 సెంచరీలు సాధించాడు. వసీం జాఫర్ తర్వాత ముంబై తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్ రహానే.

రంజీ ట్రోఫీలో ముంబైకి 42వ టైటిల్‌ను సాధించి తొమ్మిదేళ్ల నిరీక్షణను అజింక్య రహానే 2023-24లో ముగించాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా టెస్టు క్రికెట్‌లో అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు (27 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక్క సెంచరీతో 467 పరుగులు). కానీ అతను తక్కువ ఫార్మాట్లలో బాగా రాణించాడు. గత డిసెంబర్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఆడినప్పుడు రహానే టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు (469) సాధించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.

ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లలో 147.27 స్ట్రైక్ రేట్‌తో 390 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆ జట్టు ఒక మోస్తరు ప్రదర్శనతో కేవలం ఐదు విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.