Ajinkya Rahane: ఏప్రిల్ 17న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. ఇప్పటికే నాలుగు ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్ ఈ మ్యాచ్తోనైనా గెలుపు బాట పట్టాలని ఆశించింది. కానీ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఐదో ఓటమితో అభిమానులు తీవ్ర నిరాశలో ఉండగా, కెప్టెన్ అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటమి తర్వాత అజింక్య రహానే ఏమన్నాడు?
పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో రహానే మాట్లాడుతూ.. చివరి ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులతో పటిష్టంగా ఉన్న జట్టు ఆ తర్వాత కేవలం 180 పరుగులకే ఆలౌట్ కావడంపై రహానే అసహనం వ్యక్తం చేశాడు.
“ఓటమి తర్వాత మాట్లాడటం ఎప్పుడూ అంత సులభం కాదు. కానీ నేను ఇక్కడి నుండి సానుకూల అంశాలను మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. మేము ఆరంభంలో రెండు మూడు వికెట్లు తీసిన తీరు, కామెరాన్ గ్రీన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ మెచ్చుకోదగ్గవి” అని రహానే పేర్కొన్నాడు.
రహానే ఇంకా కొనసాగిస్తూ… “147/4 నుండి 180 పరుగులకే ఆలౌట్ అవ్వడం కొంచెం బాధ కలిగించింది. అయినప్పటికీ మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లిన మా బౌలర్లకు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. మనం ఈ క్షణాన్ని ఆస్వాదించాలి. మన ఆటను ఆస్వాదిస్తూ మనపై మనం నమ్మకం ఉంచుకోవాలి. ఈరోజు మేము చేయాలనుకుంది కూడా అదే” అని తెలిపాడు.
Also Read: IPL 2026 : కోల్కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం
కేకేఆర్పై గుజరాత్ ఘనవిజయం
అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. కేకేఆర్ తరపున కామెరాన్ గ్రీన్ 79 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 50 బంతుల్లో 86 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన గిల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
