Site icon HashtagU Telugu

India-Pak Match: భార‌త్‌- పాకిస్థాన్ మ్యాచ్ ర‌ద్దు అవుతుందా?

India-Pak Match

India-Pak Match

India-Pak Match: భారత్-పాకిస్తాన్ (India-Pak Match) మధ్య ఆసియా కప్ 2025 మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రెండు దేశాలు తలపడటం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు మరణించారు. ఈ సంఘటన తర్వాత భారతదేశంలో చాలా మంది భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లెజెండ్స్ లీగ్ మాదిరిగానే ఆసియా కప్ 2025లో కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

భారతదేశంలో ఆగ్రహం

26 మంది అమాయక ప్రజల మరణం తర్వాత భారతదేశం సైనిక చర్య చేపట్టి ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. దీని తర్వాత పాకిస్తాన్‌పై భారతదేశంలో ఆగ్రహం నిరంతరం పెరుగుతోంది. అప్పట్లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌పై కూడా చాలా ప్రశ్నలు తలెత్తాయి. దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆసియా కప్‌లో కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం #BoycottAsiaCup, #boycottindvspak అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

Also Read: FIR Against Congress: ప్ర‌ధాని మోదీ తల్లిపై AI వీడియో వివాదం.. కాంగ్రెస్‌పై కేసు నమోదు!

WCL 2025లో రద్దయిన మ్యాచ్

ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లీగ్‌లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు సరిగ్గా ఒకరోజు ముందు భారత ఛాంపియన్స్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్, సురేశ్ రైనా పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించారు. దీంతో టోర్నమెంట్ నిర్వాహకులు ఆ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీఫైనల్‌లో కూడా పాకిస్తాన్‌తో వాకౌట్ చేసింది. దీనితో పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆసియా కప్‌లో కూడా భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి నిరాకరిస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఐశన్య ద్వివేది విజ్ఞప్తి

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 మంది పర్యాటకులలో కాన్పూర్‌కు చెందిన శుభమ్ ద్వివేది కూడా ఉన్నారు. ఉగ్రవాదులు శుభమ్‌ను కూడా చంపేశారు. ఇప్పుడు శుభమ్ భార్య ఐశన్య ద్వివేది భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని కోరారు. “ఈ మ్యాచ్‌ను మీరు అస్సలు చూడటానికి వెళ్ళకండి. మ్యాచ్ చూడటానికి మీ టీవీని కూడా ఆన్ చేయకండి” అని ఆమె విజ్ఞప్తి చేశారు.

అనురాగ్ ఠాకూర్ ఏమన్నారంటే?

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. “ఎసీసీ లేదా ఐసీసీ బహుళ-జాతీయ టోర్నమెంట్‌లను నిర్వహించినప్పుడు ఆ టోర్నమెంట్‌లలో పాల్గొనడం ఆయా దేశాలకు తప్పనిసరి అవుతుంది. ఒకవే దేశం పాల్గొనకపోతే, అది టోర్నమెంట్ నుండి బయటకు వస్తుంది. ఆ మ్యాచ్‌ను వదిలేసి, మరో జట్టుకు పాయింట్లు లభిస్తాయి. కానీ భారతదేశం పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడదు. పాకిస్తాన్ భారతదేశంపై ఉగ్రవాద దాడులు ఆపనంతవరకు పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు అని మేము చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాము” అని చెప్పారు. భారత జట్టు 2008 నుండి పాకిస్తాన్ గడ్డపై క్రికెట్ ఆడలేదు.