Adam Gilchrist: ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. దీని తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్లో జరగనుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీకి సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ (Adam Gilchrist) ఆసక్తికరమైన జోస్యం చెప్పాడు. ఈ టోర్నీలో సెమీ-ఫైనల్స్ కు చేరుకోగల నాలుగు జట్లను గిల్క్రిస్ట్ చెప్పాడు. ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్ పేర్లను కూడా చేర్చాడు.
భారత్ ఇటీవల ఆసియా కప్ 2023 టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో శ్రీలంకను ఓడించింది. పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరలేకపోయింది. గిల్క్రిస్ట్ ఈ రెండు జట్లను సెమీ-ఫైనల్ జాబితాలో చేర్చాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను కూడా సెమీ ఫైనల్స్లో ఉంచాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకుంది.
ప్రపంచకప్ 2023కి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండటం గమనార్హం. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు టీమిండియా విశ్రాంతినిచ్చింది. ఇద్దరూ చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నారు. అందుకే పనిభారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరి వన్డేలో రోహిత్-విరాట్ ఆడనున్నారు. దీని తర్వాత అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది.
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లో జరగడం గమనార్హం. నవంబర్ 15న ముంబైలో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 16న కోల్కతాలో జరగనుంది. సెమీఫైనల్కు ముందు భారత జట్టు తన చివరి మ్యాచ్ని నెదర్లాండ్స్తో ఆడనుంది. నవంబర్ 12న బెంగళూరులో ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read: Golden Ticket To Rajnikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన బీసీసీఐ..!
ప్రేక్షకులు లేకుండానే వార్మప్ మ్యాచ్
ప్రపంచకప్కు ముందు పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న వార్మప్ మ్యాచ్కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 29న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగనుంది. మీడియా కథనాల ప్రకారం.. అక్టోబర్ 28న రెండు పెద్ద పండుగల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు వారి డబ్బు తిరిగి ఇవ్వనున్నారు.