Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లు (Online Gaming Bill) చట్టంగా మారడానికి ఒక అడుగు దూరంలో ఉంది. రాజ్యసభలో భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే ఇది చట్టంగా మారుతుంది. ఈ బిల్లు ప్రకారం.. అన్ని రకాల ఆన్లైన్ మనీ గేమ్స్పై నిషేధం విధించబడుతుంది. అయితే ఈ-స్పోర్ట్స్ (E-sports), ఆన్లైన్ సోషల్ గేమింగ్కు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ బిల్లు మంచి అంశాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (IICT) వంటి సంస్థల ద్వారా భారతదేశాన్ని గేమ్ డెవలప్మెంట్లో అగ్రగామిగా మార్చడం దీని లక్ష్యం అని ఆయన వివరించారు.
బిల్లులోని ప్రధాన నిబంధనలు
ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లు అన్ని రకాల ఆన్లైన్ మనీ గేమ్లపై నిషేధం విధిస్తుంది. దీనితో పాటు ఆన్లైన్ మనీ గేమ్ల ప్రకటనలపై కూడా నిషేధం ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇటువంటి కార్యకలాపాలకు డబ్బు ఇవ్వడం లేదా బదిలీ చేయడం నిషేధించబడింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష/ రూ. 1 కోటి వరకు జరిమానా విధించవచ్చు.
Also Read: IND vs PAK: ఆసియా కప్ 2025.. భారత్- పాక్ మ్యాచ్లపై కీలక ప్రకటన!
ఏ రకమైన గేమింగ్ యాప్లు నిషేధించబడతాయి?
డబ్బు లావాదేవీలు ఉన్న అన్ని ఆన్లైన్ గేమ్లు నిషేధించబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం ప్రకారం డబ్బు లేదా ఇతర బహుమతులు గెలవాలనే ఆశతో డబ్బును డిపాజిట్ చేసే అన్ని గేమ్లు నిషేధించబడతాయి. డ్రీమ్ 11 (Dream11), మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL), హౌజట్ (Howzat), ఎస్జీ11 ఫాంటసీ (SG11 Fantasy), వింఝో (Winzo), పోకర్బాజీ (Pokerbaazi) వంటి ప్రసిద్ధ గేమ్లపై ఈ చట్టం ప్రభావం చూపుతుంది.
బిల్లు ఎందుకు అవసరమైంది?
పార్లమెంటులో చర్చ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రజలు ఆన్లైన్ మనీ గేమింగ్లో తమ జీవితాంతం కష్టపడిన డబ్బును కోల్పోతున్నారని చెప్పారు. ఇలాంటి కొన్ని ప్లాట్ఫారమ్లను మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి దుర్వినియోగం చేస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలు ఈ గేమింగ్ యాప్లను మెసేజింగ్ యాప్లుగా కూడా ఉపయోగించాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.