Virat Kohli : వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది. వాంఖేడే స్టేడియం వేదికగా తొలి సెమీస్ భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. 2019 ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ను దెబ్బకొట్టిన కివీస్ తోనే ఇప్పుడు మరోసారి నాకౌట్ ఫైట్ జరగనుండడంతో రివేంజ్ తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెమీస్ కు ముందు అందరి చూపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. కోహ్లీని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. దీనిలో ముందు చెప్పుకోవాల్సింది వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు గురించి… ఇప్పటికే 49 సెంచరీలతో టెండూల్కర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. మరో శతకం సాధిస్తే వన్డేల్లో హాఫ్ సెంచరీల సెంచరీ కొట్టిన క్రికెటర్ గా నిలుస్తాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ విరాట్ సెంచరీ సాధించలేకపోయాడు. అయితే కివీస్ పై సెమీస్ లో సెంచరీ కొడతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే వరల్డ్ కప్ ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డు కోహ్లీని ఊరిస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్ లో కోహ్లీ 9 మ్యాచ్ లు ఆడి 594 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే సచిన్ పేరిటే ఉన్న వరల్డ్ కప్ ఎడిషన్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుతం దానికి కోహ్లీ 80 పరుగుల దూరంలో ఉన్నాడు. 2003 ప్రపంచకప్ లో సచిన్ సాధించిన 673 పరుగులే ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ప్రస్తుత వరల్డ్ కప్ లో కోహ్లీ తర్వాత సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 591 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర 565 రన్స్ తోనూ , భారత కెప్టెన్ రోహిత్ శర్మ 503 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే జట్టు గెలిచినప్పుడు అత్యధిక శతకాలు సాధించిన రికార్డు కూడా కోహ్లీని ఊరిస్తోంది. వాంఖేడే మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొట్టి భారత్ గెలిస్తే అతను పాంటింగ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. బుధవారం జరిగే మ్యాచ్ లో కోహ్లీ అదరగొట్టి ఈ రికార్డులు అందుకోవాలని అభిమానులు(Virat Kohli) ఆకాంక్షిస్తున్నారు.