ప్రకృతి వ్యవసాయమే ఉత్తమం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం పులివెందులులోని ఏపీసీఏఆర్ఎల్లో న్యూటెక్ బయోసైన్సెస్కు ఆయన శంకుస్థాపన చేశారు. రసాయనాలు కలిగిన ఆహారం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని, ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గమని అభిప్రాయపడ్డారు.ఏపీలో ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై ఎక్కువగా దృష్టి సారించాలని, అందుకోసం గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరమని కోరారు. ఆర్బీకేల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని వైఎస్ జగన్ కోరారు. సేంద్రియ వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోందని వైఎస్ జగన్ తెలిపారు. ఆర్ బీకేల ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం తరపున అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కోన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.