Site icon HashtagU Telugu

Pakistan Crisis: మొన్న గోధుమపిండి.. రేపు నూనెలు.. పాక్‎లో దయనీయ స్థితి!

Pakistan Economy Crisis Explained

Pakistan Economy Crisis Explained

Pakistan Crisis: మన దాయాది దేశం పాకిస్థాన్ లో విపరీతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఇప్పటికే తినడానికి తిండి లేని పరిస్థితులు ఉండగా.. అక్కడి ప్రజలు తిండి గింజల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీలంకలో ఎలాగైతే ఆర్థిక మాంద్యం పెరిగిపోయి.. దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయో.. పాకిస్థాన్ లో అంతకన్నా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

గోధుమపిండి దొరక్క అక్కడి ప్రజలు అల్లాడుతుండగా.. గోధుమపిండి ఉన్న ట్రక్కు వెంట పాకిస్థానీలు పరుగులు పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవడం తెలిసిందే. రాబోయే రోజుల్లో దేశంలో వంట నూనెలు, నెయ్యి దొరకడం కష్టమవుతుందని, ప్రజలు తినడానికి వంటనూనె కూడా దొరకని పరిస్థితి రాబోతుందని.. పరిస్థితులు మరింత దారుణంగా మారబోతున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

రాబోయే 20-30 రోజుల్లో వంట నూనుల సంక్షోభం రానుండగా.. ఓడరేవుల్లో ఉన్న నిత్యావసర వస్తువుల పత్రాలను క్లియర్ చేయడంలో అక్కడి బ్యాంకులు విఫలం అవుతున్నాయని ట్రేడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ రెహాన్ ఆరోపిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో వంట చేసుకోవడానికి వంట నూనె దొరకని స్థితి ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

ఇక మరోపక్క పాకిస్థాన్ లో విదేశీ నిల్వలు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. మూడు వారాలకు మాత్రమే సరిపడా విదేశీ నిల్వలు ఉండగా.. రాబోయే మూడు వారాల తర్వాత పాక్ చేతులెత్తేస్తుందనే చర్చ నడుస్తోంది. కాగా పాక్ కు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఐఎంఎఫ్ వంద కోట్ల డాలర్ల సాయానికి ముందుకు వస్తుందనే నమ్మకంతో ఉంది. కానీ ఒకవేళ ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ వర్కవుట్ కాకపోతే మాత్రం పరిస్థితి ఊహించడానికి కూడా వీలుకానంత దారుణంగా ఉండబోతోంది.