మొట్టమొదటి విమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premier League) నిర్వహణ కోసం ముంబైలో వేలం జరుగుతోంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్ లో మొత్తం 12 జట్లు బరిలోకి దిగనున్నాయి. వేలంలో భారత్ సహా పలు దేశాలకు చెందిన 409 మంది మహిళా క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశం ఉంది. టీమిండియా ఓపెనర్ స్మృతి మందానాను (Smriti Mandhana) బెంగళూరు టీమ్ రూ. 3.40 కోట్లకు దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీ గార్డనర్ భారీ ధర పలికింది. ఆమె కోసం ముంబయి, యూపీ వారియర్స్ పోటీ పడ్డాయి. చివరికి గుజరాత్ జెయింట్స్ రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ను ఆమె కనీస ధర రూ.50 లక్షలకు ఆర్సీబీ (RCB) సొంతం చేసుకుంది. ఆసీస్ ప్లేయర్ ఎలిస్ పెర్రిని రూ.1.70 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.
ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్ కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. ఆమెను రూ.1.80 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్ లో టీమ్ఇండియా బౌలర్ దీప్తి శర్మ (Deepthi sharma) వేలంలో భారీ ధర పలికింది. ముంబయి, ఢిల్లీ, గుజరాత్, యూపీ జట్లు పోటీ పడాయి. ఆమెను దక్కించుకునేందుకు ముంబయి రూ.2.40 కోట్లు వెచ్చించేందుకు రెడీ అయింది. చివరకు యూపీ వారియర్స్ రూ.2.60 కోట్లకు దీప్తిని దక్కించుకుంది. టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ రేణుక సింగ్ని రూ.1.50 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.