ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ శర వేగంగా వ్యాప్తి చెందుతున విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఒమిక్రాన్ నిర్ధారణ అవుతుండడం గమనార్హం. 2021 ముగుస్తోన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెడ్రోస్ అథనామ్ జెనీవాలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రపంచ దేశాలన్నీ కలిసి 2022 సంవత్సరంలో కరోనాను అంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచంలో కలకలం సృష్టిస్తోందని ఆయన అన్నారు.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జన సమూహాలు పెద్ద ఎత్తున కనపడే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి సమయంలో పండగల వేళ ఆంక్షలు తప్పనిసరిగా విధించాలని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇతర వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాపిస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే పండుగలు చేసుకోకుండా ఉండడం మంచిందని ఆయన హెచ్చరించారు.