Congress Govt: త్వరలో ధరణిపై శ్వేతపత్రం.. మార్చి 1 నుంచి సదస్సులు

  • Written By:
  • Updated On - February 28, 2024 / 12:07 AM IST

Congress Govt: ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికి ఒక కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును కొల్లగొట్టారో త్వరలో ప్రజలముందు పెట్టబోతున్నామని తెలిపారు. భూరికార్డులకు శరాఘాతంగా పరిణమించిన ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో “తెలంగాణ పునర్నిర్మాణం” పై నిర్వహించిన సెమినార్ కు మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ, ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి మార్చి 1వ తేది నుండి 7వ తేది వరకు ఎమార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.రాష్ట్రాన్ని విభజిస్తే, రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిసి కూడా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సోనియాగాంధీ నెరవేర్చారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, అసెంబ్లీ లో అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ప్రకటించారని చెప్పారు.

ఏ ఉద్దేశ్యంతో, ఏ లక్ష్యంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారో గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అవి నెరవేరలేదని అన్నారు. అరవై ఏళ్ళ ఆకాంక్షలకు భిన్నంగా వ్యహరించారు. గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, తెలంగాణ అస్తిత్వాన్ని మంట కలిపారు.నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో తీరని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసారు.