హిందూమహిళలు నిత్యం పూజలు చేస్తుంటారు.పురుషుల్లో కూడా రోజు దైవచింతన పెరుగుతోంది. ప్రతిఒక్కరూ దేవుడ్ని తమకు తోచిన రీతిలో కొలుసుకుంటారు. కొంత మంది ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ దేవుడికి పూజ చేసిన ఫలితాన్ని పొందాలనుకుంటారు. అలాంటి వారికోసం శివమహాపురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. దేవతల ప్రీతికోసం అయిదు విధాల పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం,హోమం, దానం,తపస్సు,సమారాధనలు ఇవి అయిదు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ వేదిక. ప్రతిమ, అగ్ని కానీ బ్రహ్మణుడిని షోడశోపచరాలతో పూజించడం ఈ నాలుగు రకాల్లో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైంది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కో వారం ఒక్కో దేవతకు పూజ చేయాల్సి ఉంటుంది.
ఆదివారం:
ఆదివారంనాడు ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజిస్తేమంచిది. ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు, శిరోరోగం,కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేదపండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒకరోజు నుంచి ఒక మాసం, ఒక ఏడాది లేదా మూడేండ్లపాటు రోగతీవ్రతను అనుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.
సోమవారం:
ఈ వారం సంపద కోరుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. ఆ రోజున పూజ తర్వాత వేదపండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టినట్లయితే పుణ్యం లభిస్తుంది.
మంగళవారం:
రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలను వేదపండితులకు భోజనంగా పెట్టాలి.
బుధవారం:
బుధవారం పెరుగు అన్నంను విష్ణువుకు నివేధించాలి. ఈ పూజ నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు భార్య కు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
గురువారం:
గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్నికోరుకునేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మంచిది.
శుక్రవారం:
శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగభాగ్యాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల త్రుప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల సంత్రుప్తి కోసం మంచి వస్త్రాలను బహుకరించాలి.
శనివారం:
శనివారం రుద్రాది దేవతలను ఆరాధించడం మంచిది. అపమ్రుత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు శనివారం నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి. నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేస్తే పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
మొత్తానికి ఏడు రోజులలో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషించేది శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావిస్తాడు. ఆ పూజాఫలాన్ని ఆ శివుడే భక్తులకు స్వయంగా ప్రసాదిస్తాడు.