Weather Updates: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ..!

జూన్ 29 వరకు వర్షాల తీవ్రత కొనసాగవచ్చని, జూన్ 30 నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Updates) తెలిపింది.

  • Written By:
  • Publish Date - June 29, 2023 / 08:36 AM IST

Weather Updates: దేశంలోని చాలా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు. అయితే కొన్ని చోట్ల ప్రజలు నీటి ఎద్దడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెట్ట ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. జూన్ 29 వరకు వర్షాల తీవ్రత కొనసాగవచ్చని, జూన్ 30 నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Updates) తెలిపింది.

దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల క్రితమే వర్షాల ప్రక్రియ ప్రారంభమైంది. దీని వల్ల ప్రజలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందారు. ఢిల్లీలో గురువారం ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 4 వరకు ఢిల్లీలో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఈ జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Also Read: Minister Amit shah: బండి సంజ‌య్‌కు అమిత్ షా ఫోన్‌.. ఆ విష‌యంపై స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చిన షా..

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో సట్లెజ్ నది నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది. దానివల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు.సిమ్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాఖండ్‌లో గురువారం (జూన్ 29) ఆ శాఖ కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవా, కేరళలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.