Legislative Assembly Speaker Prasad Kumar : వికారాబాబాద్ జిల్లా మోమిన్ పేట మండల కేంద్రంలోని నంది వాగు ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచ్చేసి చెరువులో చేప పిల్లలను వదిలారు. అనంతరం మండలంలోని మత్స్యకారులతో మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు డిసెంబర్ 9 కల్లా మాఫీ పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
గతంలో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ఆడపడుచులకు త్వరలోనే రూ.2,500 గృహలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీధర్, వైస్ చైర్మన్ నర్సింలు, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, తహసిల్దార్ మనోహర్ చక్రవర్తి, లక్ష్మి, మత్స్యకారుల జిల్లా అధికారి వెంకటయ్య, ఎఫ్ డి ఓ సౌజన్య, మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, డి.ఎస్.పి సీఐ నవీన్ కుమార్ ఎస్సై అరవింద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మస శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఆగస్టు 15వరకు మూడు విడతల్లో ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది. అయితే చాలా మంది రైతులకు ఆధార్ కార్డుల్లో తప్పులు, బ్యాంకు ఖాతాల విషయంలో జరిగిన అవకతవకల కారణంగా రుణమాఫీ కాలేదు. రెండు మూడు నెలల్లోనే.. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేయగా.. కొన్ని కారణాల వల్ల దాదాపు 4 లక్షల మందికి రుణమాఫీ ఇంకా కాలేదు. దీంతో వారికి దీపావళి తర్వాత రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా రుణమాఫీ కాని రైతులు గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. వెంటనే రుణమాఫీ చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం దీపావళి తర్వాత వారికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై చర్చించిన మంత్రివర్గం వీలైనంత త్వరగా రుణమాఫీ కాని వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది.