భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో గోదావరి నది నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. మంగళవారం భద్రాచలంలో నీటిమట్టం 18.1 అడుగులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయానికి నీటిమట్టం 25 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మంగళవారం చెర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 9,400 క్యూసెక్కుల నీరు నదిలోకి వచ్చి చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమైయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరద ఉధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.