Fire Accident : సికింద్రాబాద్‌ రూబీ హోటల్ అగ్ని ప్రమాదంలో విజయవాడ వాసి మృతి

సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో విజ‌య‌వాడ‌కు చెందిన హ‌రీష్ అనే యువ‌కుడు మృతి చెందాడు.

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 01:27 PM IST

సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో విజ‌య‌వాడ‌కు చెందిన హ‌రీష్ అనే యువ‌కుడు మృతి చెందాడు. హరీశ్ మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బ్యాంకు శిక్షణ కోసం ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వెళ్లినట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. హరీష్ బస చేసిన హోటల్‌లో మంటలు చెలరేగాయని అతని స్నేహితుడు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రంతా టెన్షన్‌గా ఉన్నామని, తెల్లవారుజామున 3 గంటలకు హరీష్ గాంధీ ఆస్పత్రిలో ఉన్నాడని తెలిసిందని చెప్పారు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హరీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో చిన్నవాడు 10 రోజుల క్రితం జన్మించాడు. ఎంటెక్, ఎంబీఏ పూర్తి చేసిన హరీష్ ఎస్‌ బ్యాంక్‌లో ఉద్యోగం పొందాడు. దీనిలో శిక్ష‌ణ నిమిత్తం సికింద్రాబాద్‌కు వ‌చ్చారు. ఎస్ బ్యాంక్ కంటే ముందు కోస్టల్ బ్యాంక్‌లో హ‌రీష్ పనిచేశాడ‌ని కుటుంబ సభ్యులు తెలిపారు.