Andhra Pradesh:మంత్రి కొడాలి నాని సాక్షిగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వంగ‌వీటి రాధా.. ?

కృష్ణాజిల్లా గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లం చిన‌గొన్నురులో దివంగ‌త నేత వంగ‌వీటి మోహ‌న‌రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భనేని వంశీ, వంగ‌వీటి రాధా, జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ ఉప్పాల హారిక పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - December 26, 2021 / 07:05 PM IST

కృష్ణాజిల్లా గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లం చిన‌గొన్నురులో దివంగ‌త నేత వంగ‌వీటి మోహ‌న‌రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భనేని వంశీ, వంగ‌వీటి రాధా, జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వంగ‌వీటి రాధా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా సంచలన ఆరోపణలు చేశారు. రంగా కీర్తి ,ఆశయాల సాధనే తన లక్ష్యమ‌ని..త‌న‌కు పదవులపై ఆశ లేదన్నారు. తనను ఏదో చేద్దాము అనుకుని రెక్కీ నిర్వహించారని.. తాను భయపడనని అన్ని వేళలా తాను సిద్ధంగా ఉన్నాన‌ని రాధా ప్ర‌క‌టించారు. తనను పొట్టన పెట్టుకోవాలి అనుకునే వారికి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటాన‌ని రాధా తెలిపారు. తనను లేకుండా చెయ్యలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని హితవు ప‌లికారు.

మ‌రోవైపు వంగవీటి రాధా పై మంత్రి కొడాలి నాని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టిడిపి నాయకులు చెప్పార‌ని..అయినా రాధా పదవులను ఆశించకుండా పార్టీలో చేరార‌ని అన్నారు. బంగారం లాంటి రాధా తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. రాగి కలిపితేనె బంగారం కూడా కావలసిన ఆకృతిలో వస్తుందని.. కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడని అన్నారు.